Friday, March 28, 2014

పద్య సాహిత్యం--8 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు..........

నీవొక యప్సరః ప్రణయినీ..................
...........................సురరాజ్య లక్ష్మికిన్‌.

విరిసినపూల వెన్నెలల వెల్లువఁ ..................
........................హృదంతర బాష్పమాధురిన్‌.

వలచి నిన్ను విసిగించినందులకు ...........
...................................సలుపుకొనుము.

........ఇవి కవి వ్రాసిన "ఓయి సుధాకరా!" అనే ఖండిక లోనివి.

*             *             *

తరతరమ్ముల ప్రేమ.....................
...........నీ యలంకారభరము........

"కోరికల నెల్లమరచి, నాకొరకు నీవు
నీ కొరకు నేను తొలి వేగుబోక రాలు
పూల జత వోలె నీ సుధా పూరమందు 
తేలిపోదము జన్మజన్మాల యాత్ర".

(ఇది ఆయన మార్కు కొట్టొచ్చినట్టు కనిపించే పద్యం. అందుకే ఇక్కడ పూర్తిగా ఇచ్చాను.)

దగ్ధ దినైక చితా......................
.........................క్షతికేల వగపు

అరణి మధించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి.  

ఇవి ఆయన యాత్ర అనే ఖండిక లోనివి.

"నీచపు దాస్య వృత్తి..............
...............సమాధి మృత్తిగన్‌".

ఇది "కాంక్ష" అనే ఖండికలో, పువ్వు కోరికని తెలిపేవి. "మఖన్‌లాల్ చతుర్వేది" హిందీలో వ్రాసిన "ఫూల్ కీ ఇచ్చా" అనే కవితకి స్వేచ్చానువాదం. ఆ హిందీ కవితని నా "సాహితీ కృష్ణ" బ్లాగులో ఇదివరకే వ్రాశాను).

ఇంక కవి పేరు వేదుల సత్యనారాయణ శాస్త్రి. దీపావళి కవిగా సుప్రసిధ్ధులు. 

భద్రాచలం తాలూకా గొల్లగూడెం గ్రామం లో 1900 మార్చ్ 22 న జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు. 1975 లో పరమపదించారు. కృష్ణశాస్త్రి కి చెప్పుకోదగ్గ వారసులు. ఆయన పంథాలోనే, ఇంకా విశిష్టంగా పురోగమించారు. వాళ్లిద్దరి కవితలకీ తేడా స్పష్టంగా తెలియడమే ఈయన విశిష్టత. 

ఈయన దీపావళి; ముక్తఝరి అనే ఖండకావ్యాలూ, అపరాధిని; ధర్మపాలుడు అనే నవలానువాదాలూ, రాణాప్రతాపసింహ; కాలేజ్ గర్ల్ నాటకాలూ వెలువరించారు. ఇంకా "జయము హిమగిరి మణికిరీటా"; "ఏమగునో ఇక నా బ్రతుకు"; "ఈ సముద్ర తటాన"; "ఓ దివ్య గాయకా, ఓ ప్రాణ గాయకా"; "కోసుకొనుము ఈ కోమల కుసుమము"; "ఈ చకోరికకు ఎన్నడూ పున్నమ" లాంటి అనేక ప్రసిద్ధ గీతాలు వ్రాశారు. 

సంస్కృతాంధ్ర ఉభయ భాషా ప్రవీణులే కాకుండా, బెంగాలీ, కన్నడ నేర్చుకున్నారు. ఠాగూర్ బాల సాహిత్యాన్ని తెలుగు చేశారు. భాస మహాకవి నాటకాలు కొన్ని అనువదించారు. అనేక కథలు వ్రాశారు. 

శతాధిక గ్రంథకర్తలైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యులు. 

వీరికి "గౌతమీ కోకిల" బిరుదు తెచ్చిపెట్టింది దీపావళి ఖండకావ్య సంపుటి. "ఇంటింట ఆనంద దిపావళీ" అంటూ సాగుతుంది. కుమారుడి అకాల మరణం తో, "మా యింట శోకాంధ తిమిరావళీ" అని ఆక్రోశిస్తారు. అందులోని "ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయాడు" అనే వాక్యం విశ్వసాహిత్యం లో చోటు చేసుకోతగ్గది అని ప్రశంసించబడింది.

"నేనే మిగిలితి నీ గౌతమీనదీ ప
విత్ర గర్భమ్ములో మ్రోత లెట్టుచున్న
యుగ యుగాంతర విశ్వమహోగ్ర దుఃఖ 
జీవగీతాల కావృత్తి చెప్పుకొనగ."

అని చెప్పుకొన్న మహానుభావుడాయన!

No comments: