Tuesday, April 15, 2014

పద్య సాహిత్యం--9 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు..................

"భావ మొక్కడు గాగ,...............................
......................రంగ నిర్వహణమ్ము, రక్తి నిల్పి,

సుందరీనంద జీవితానందమట్లు........
........సృష్టిచేసితి మీ కావ్యశిల్పమూర్తి."

.....ఇది "సౌందర నందం" కావ్యం చివర్లో, కవులు తమ గురించి తాము చెప్పుకున్న పద్యం.

*         *         *
"రండు మాయింటి కీరు పేరంటమునకు...........
.....................................మా తల్లి! పౌష్యలక్ష్మి!"

.....ఇది "సంక్రాంతి" ఖండ కావ్యం లోనిది.
*        *        *
"కంకి వెడలిన ఆ లేతకారు జొన్న.......
.............................దిగకు మంచె!......"

......ఇది "జొన్న చేను" అనే ఖండిక లోని శబ్ద చిత్రం.
*        *        *
ఎఱ్ఱ సెరలనందుని చూపులు, ఇంతి.......
......................................నల్లకల్వపూల!

.....ఇది సౌందర నందం లో 'భిక్షాగమనం' ఘట్టం లోని సుందరీ నందుల ప్రేమాతిరేకాన్ని చిత్రించేది.
*        *        *
ప్రాణమా! యంచు నొండొరు పల్కరింప.........
.................'గఛ్ఛామి బుధ్ధం శరణ' మటంచు.
 
......ఇది అదే కావ్యం లో సుందరీ నందులు సన్యాసం స్వీకరించాక అలవరచుకున్న నిగ్రహానికి చిత్రణం.

ఇంక ఇవి వ్రాసిన కవులు "పింగళి కాటూరి" జంటకవులుగా ప్రసిధ్ధులైన పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వర రావు లు.

పింగళివారు 1894 లోనూ, కాటూరివారు 1895 లోనూ జన్మించారు. వీరిద్దరూ సహాధ్యాయులు. తరువాత చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారి శిష్యులు. గళాలు వేరైనా, కలం ఒక్కటిగా ఆధునిక సాహిత్యం లో శాశ్వత పీఠం సాధించారు. భావ కవితా యుగం లో, విశ్వనాధ, రామిరెడ్డి, బాపిరాజు, కవికొండల వంటి కవుల శ్రేణి కి చెందిన వారు. 

ఆ కాలం లో, సాహిత్యం లో నడిచిన మానవోద్యమ, కాల్పనికోద్యమ, హైందవోద్యమ, స్వాతంత్ర్యోద్యమాల్లో వీరిపై యెక్కువ ప్రభావం చూపింది మానవోద్యమం. ఆ ఛాయలు 1932 లో తొలిసారి వెలువడిన వారి ప్రసిధ్ధ కావ్యం 'సౌందరనందం' లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆశ్వఘోషుడు సంస్కృతం లో రచించిన అదే పేరిటి గ్రంథాన్ని, మూలం మాత్రం స్వీకరించి, చాలా స్వతంత్రతతో రచించారీకావ్యాన్ని. 

బుద్ధుడి కాలం లో ప్రణయ సామ్రాజ్యం లో మునిగి తేలుతున్న సుందరి, నందుడు అనేవాళ్ల కి శాక్యర్షి కాస్త బలవంతంగానే సన్యాసం ఇప్పించడంతో, తల్లడిల్లుతూనే, పూర్తిగా మారుతారు. ఇదీ ఇతివృత్తం. 

వీరిద్దరూ జంటగా రచించిన కృతులు "తొలకరి", "సౌందరనందం". కాటూరి వారు విడిగా "గుడిగంటలు", "పౌలస్త్యహృదయం", "మావూరు" వంటి ఖండ కృతులూ, నన్నయభట్టు నుంచి దొప్పలపూడి అనసూయాదేవి (11 వ శతాబ్ది నుంచి 20 వ శతాబ్ది) వరకూ గల కవుల కవితల్ని "తెలుగు కావ్యమాల" గా మూడు పేటలుగా 1959 లో సంకలనం చేశారు. కాటూరి వారి గుడిగంటలు హరిజనోద్యమ ప్రభావంతో వెలువడింది. 

పింగళివారు "సాహిత్య శిల్ప సమీక్ష" అనే ఉద్‌గ్రంధం రచించారు. తెలుగునుంచి సంస్కృతం నేర్చుకోడానికి "కుమార వ్యాకరణం" అనే సంస్కృత వ్యాకరణం రూపొందించారు. ఇంకా "ఆంధ్ర సాహిత్య చరిత్ర" (కృష్ణరాయ యుగం వరకూ) వ్రాశారు. 

ఇద్దరూ వెలువరించిన ఖండకృతుల్లో "సంక్రాంతి", "తొలకరి" 1915-19 మధ్య వెలువడ్డాయి.  

ముందుగా పింగళివారూ, తదుపరి కాటూరి వారూ పరమపదించారు. ఇంద్రసభలో యేమి వ్రాస్తున్నారో!



No comments: